BRS Party: బాటలో తెలంగాణ జాగృతి..? MLC Kavitha పక్కా ప్లాన్ వేశారా..?

by Disha Web Desk |
BRS Party:  బాటలో తెలంగాణ జాగృతి..? MLC Kavitha పక్కా ప్లాన్ వేశారా..?
X

దిశ,డైనమిక్ బ్యూరో: తెలంగాణలో జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ఇకపై దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన అవసరం ఉందని, జిల్లా అధ్యక్షులు రాబోయే కాలంలో వేర్వేరు రాష్ట్రాల్లో పని చేయాల్సి ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలో ఉన్న సమస్యలపై జాగృతి పోరాటం చేయబోతోందని అన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులు, రచయితలు, మహిళలు, కార్మికులు, రైతులు, విద్యార్థులను ఏకం చేసి తెలంగాణ తరహా ఉద్యమాన్ని దేశంలో తీసుకురాబోతున్నట్టు చెప్పారు. సోమవారం హైదరాబాద్ ముషీరాబాద్‌లో జరిగిన తెలగాణ జాగృతి సమావేశంలో మాట్లాడిన కవిత దేశంలో బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీజేపీ విధానాలను నిలదీసే వ్యవస్థ లేకుండా పోయిందని అదే తెలంగాణలో మన ప్రభుత్వమే ఉన్నా బాసర విద్యార్థులు ఆందోళన చేస్తే మంత్రులు అక్కడ పర్యటించారని గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వం రకరకాల పద్ధతుల్లో వ్యవస్థలను వాడుకుంటోదని, విపక్షాలు అనుకునే వాళ్లపై ఎటాక్ చేస్తోందన్నారు. మీడియాకు లేనిపోని లీకులు ఇచ్చి వ్యక్తిత్వాన్ని చంపే ప్రయత్నాలను బీజేపీ చేస్తోందని ఆరోపించారు. బీజేపీ అప్రజాస్వామికంగా ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చితే మీడియా ధైర్యంగా రాయలేక బీజేపీకి అనుకూలంగా రాస్తోందని ఆరోపించారు. బీజేపీ విధానాలను నిలదీసే వ్యవస్థ లేకుండా పోయిందని అన్నారు. ఇవాళ తాను బాధతోనే మాట్లాడుతున్నానని ఎమర్జెన్సీ సమయంలో పత్రిక ధైర్యంగా ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపారని, ప్రస్తుతం మీడియాను చూస్తుంటే ఫోర్త్ ఎస్టేట్ బికం ఏ ప్రైవేట్ ఎస్టేట్‌గా మారిపోయిందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను మనం కాపాడితే ఆ వ్యవస్థలు మనలను ఒక నాడు కాపాడుతాయని అన్నారు. వీటన్నింటిపై తెలంగాణ జాగృతి తరపున దేశమంతా తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

అంబేద్కర్ స్ఫూర్తితో ప్రొ.జయశంకర్ సార్ ఓ విషయాన్ని చెప్పేవారని ప్రజాసమూహాలను చైతన్యం చేయాలంటే భావజాల వ్యాప్తినే ప్రధానమైనదని త్వరలో జాగృతి సంస్థ దేశమంతటా ఇదే చేయబోతోందని అన్నారు. త్వరలో మరోసారి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టుకుని సంపూర్ణ కార్యచరణపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు. భవిష్యత్ లో మనతో అనేక సంస్థలు కలిసి రాబోతున్నాయని, ప్రస్తుతం తెలంగాణలో జాగృతి ప్రబలమైన శక్తిగా ఉందని 33 జిల్లాల్లో దాదాపు పన్నెండు వేల గ్రామాల్లో ప్రతిఒక్క చోట నాయకులు, కార్యకర్తలు ఉన్నాయన్నారు. 18 దేశాల్లో జాగృతి కమిటీలు పని చేస్తున్నాయని మహారాష్ట్రలో గత ఐదేళ్లుగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయని ఒక్క పిలుపు ఇస్తే ప్రతి రాష్ట్రంలో మనకు ఓ శాఖ ఏర్పడే శక్తి ఉందన్నారు.

సీబీఐ విచారణపై రియాక్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ ప్రశ్నించడంపై కవిత రియాక్ట్ అయ్యారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడి తన ఒక్కరిపైనే చేయడం లేదని దేశంలో అంతటా ఇదే జరుగుతోందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారితో ఏజెన్సీలు మాట్లాడుతున్నాయని అన్నారు. ఏజెన్సీల రూపంలో మన సమయాన్ని వృథా చేయాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల కళ్లలో కన్నీళ్లు రావని నిప్పులు వస్తాయని, వెనక్కి తగ్గేది లేదన్నారు.

త్వరలో తెలంగాణ జాగృతి పేరు మార్పు?

సీబీఐ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడని కవిత ఆ మరుసటి రోజు జాగృతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తిగా మారింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా ఆవిర్భవించిన నేపథ్యంలో త్వరలో తెలంగాణ జాగృతి పేరును మార్చబోతున్నారా అనే చర్చ జరుగుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా పని చేయబోతున్నామని కవిత స్వయంగా చెప్పడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది. మరో సారి జాగృతి నేతలతో భేటీ కాబోతున్నామని చెప్పిన కవిత.. భవిష్యత్ కార్యచరణపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నామని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చి దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కోసం భావజాల వ్యాప్తికి ఉపయోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే కవిత నిర్ణయం వెనుక మరో ఆసక్తికర చర్చ కూడా తెరపైకి వస్తోంది. లిక్కర్ స్కాంలో కవిత నుంచి సీబీఐ వివరణ తీసుకోవడంతో పాటు మరోసారి విచారిస్తామని నోటీసులు ఇవ్వడంతో ఈ విషయంలో జాగృతి పేరుతో ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నాలు చేస్తోందా అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. తాజాగా జరిగిన మీటింగ్ లో పలువురు ప్రముఖులు హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నాటి సంగతులను ప్రస్తావించడం, పాటలు, కవితలు చెబుతూ జాగృతి ఏం చేసిందో ప్రస్తావించడం చూస్తుంటే రాష్ట్రంలో మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను జాగృతి ద్వారా గ్రామగ్రామాన రగిలించే ప్రయత్నాలు చేయబోతున్నారా అనే చర్చ జరుగుతోంది.

READ MORE

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కీలక విజ్ఞప్తి చేసిన క్రైస్తవులు

Next Story